శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్

  • శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
  • ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
  • ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
  • నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 65 వేల పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సవిత వెల్లడించారు.

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ఈ శుభవార్తను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి సత్యకుమార్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ శాలువాల సరఫరా కోసం ధర్మవరంలో ప్రత్యేకంగా ఆప్కో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. దీని ద్వారా నేరుగా చేనేతల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి టీటీడీకి అందిస్తామని వివరించారు.

ఈ సందర్భంగా ధర్మవరం చేనేత కార్మికులు తయారు చేసిన నమూనా పట్టు శాలువాను మంత్రులు సవిత, సత్యకుమార్ ఆవిష్కరించారు. టీటీడీ నిర్ణయంతో ధర్మవరం ప్రాంతంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TTD
Dharmavaram silk
Tirumala
APCO
Handloom weavers
Silk sarees
Paritala Sriram
Minister Savitha
Satyakumar Yadav
Mega Handloom Cluster

More Telugu News